6, డిసెంబర్ 2008, శనివారం

ఓ..ప్రజా..ఇది నిజం...!!

ముమ్మాటికి ఇది నిజం..ఇది నిరుపేదల రాజ్యం ..!
మరి వారి సంపదే కదా పెద్దలకు భోజ్యం..!!

సెజ్ ల పేరున బడుగు జీవుల భూమికి ఎసరు..
పచ్చని పేదల జీవితాల్లో పచ్చ గన్నేరు పసరు..
అయిన వారందరికి అడగకున్నా కొసరు..
న్యాయదేవత సాక్షిగా తీయునయ్యా ప్రజల ఉసురు..!

పరిశ్రమల పేరున వేలకొద్దీ ఎకరాల దోపిడి..
పెట్టుబడిదారునికే పలురకాలుగా రాబడి..
దళారితనం చేసినందుకు అధినేతకు కోట్లల్లో భిక్ష..
ఈ దగుల్భాజీ నేతలకు ఏ దేవత రక్ష..?

ప్రత్యర్ధుల్ని తుదముట్టించడమే రాజకీయ చతురత..
జైళ్ళ గదులలోనూ ఉండదయ్యా శరాణాగతునికి భధ్రత..
పరుల భూమిని దోచుకొను పురుగులకే చేయూత..
అరాచకత్వాంలో ఈ ప్రభుత్వానిదే చెల్లిపోని ఘనత..

బిడ్డల కడుపు నింపేటందుకు తల్లి అగును వ్యభిచారి..
కోట్లు దిగమింగేటందుకు నేతాయెను పాదాచారి..
కడుపు నింపినా పడుపువృత్తి ఇవ్వదా దేహానికి కుష్టురోగం..?
ముస్టి ఆశల అష్ట్రావకులే నేతలైతే కాదా అది దేశానికి భ్రష్టు యోగం..?

జేబుదొంగకు జైలు శిక్ష వార్తాయెరా మనకు..!
కోట్లు మింగిన కాట్లకుక్కలు నాయకులాయెరా తుదకు..!!
బుద్ది లేదా ఓ..ప్రజా..! నిలదీయ్యొద్దా ఈ నాయకుల అవినీతిని..?
నోటుకోసం ఓటు వేసిననాడే పూడ్చినావురా గోతిలో నీ నీతిని..!!!